ఇడుక్కి : కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో మంకులం దగ్గర ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. కొంతమంది వేటగాళ్లు ఒక ఆరేళ్ల వయసు గల చిరుత పులి ని చంపి ఏకంగా దాన్ని కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు.
ఇడుక్కి జిల్లాలోని మంకుళం అనే చిన్న పట్టణం అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. వినోద్ అనే ఒక వ్యక్తి మునిపారా వద్ద అటవీ ప్రాంతంలో 100 మీటర్ల దూరంలో ఒక ఉచ్చును బిగించాడు. అయితే అనుకోకుండా అందులో ఆరేళ్ల మగ చిరుత చిక్కుకుంది. కురియాకోజ్ సహాయంతో చిరుతను ఇంటికి తీసుకొచ్చిన ఆ బృందం, దానిని చంపేసి, చర్మాన్ని వేరు చేసి, కూరవండుకుని తిన్నారు.
అయితే పోలీసులకు సమాచారం అందటంతో, హుటాహుటిన బయలుదేరి ఈ ఘటనలో పాలుపంచుకున్న ఐదుగురు వ్యక్తులను ఇంటి వద్దనే అరెస్ట్ చేశారు. దాదాపు పది కేజీల వరకు మిగిలిన చిరుత మాంసాన్ని, చర్మాన్ని, దంతాలను మరియు ఎముకలను కూడా స్వాధీనం చేసుకున్నారు.