యూఏఈ, ఒమన్లో టీ20 ప్రపంచకప్ 2021 మెగా సమరం ఆదివారం ప్రారంభం అయింది. క్వాలిఫైయర్ మ్యాచులు ఈరోజు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రపంచకప్ కోసం అర్హత సాధించిన జట్లు సోమవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక అసలు సమరం సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. అక్టోబర్ 24న ఫైనల్ కానీ ఫైనల్ పోరు జరుగనుంది. భారత్ తన ప్రయాణాన్ని దాయాది దేశం పాకిస్తాన్తో ఆరంబించనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి మాత్రం ఎప్పటిలానే తలనొప్పి తప్పేట్లు లేదు. ప్రతిసారి భారత్-పాక్ మ్యాచ్ జరిగినప్పుడు.. ఒకవైపు పుట్టినిళ్లు, మరోవైపు మెట్టినిళ్లు మధ్య ఆమె నలిగిపోతున్నది. దాంతో ఈసారి సానియా ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్ ఈ నెల 24న పాకిస్తాన్తో జరగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా అని ఆశగా ఉన్నారు. అయితే భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రం.. ఆ రోజున సోషల్ మీడియాకు దూరంగా ఉండనుందట. మ్యాచ్ సమయంలో చెడు వాతావరణాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అందుకు కారణం లేకపోలేదు. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సానియాను రెండు దేశాల ప్రేక్షకులు ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే సానియా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ ప్లేయర్ కావడమే.
భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇరు దేశాల నెటిజెన్ల ట్రోల్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాలో కనిపించకుండా పోవాలని నిర్ణయించుకున్నట్లు సానియా మీర్జా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఏడు సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో సానియా ఉన్నట్టుండి మాయమయిపోతుంది. ఆ వీడియోలో ఓ పోస్ట్ కూడా ఉంచింది. ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రోజున చెడు వాతావరణం నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా’ అని వీడియోపై కాప్షన్గా రాసింది. అంతేకాదు అలిగినట్టుగా, నవ్వుతున్నట్టుగా ఉన్న రెండు ఎమోజీలను కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోపై కొందరు ఫాన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహంపై భారత్లో ఓ వర్గం అభిమానులు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010 ఏప్రిల్లో వీరి వివాహం జరగ్గా.. 2018 అక్టోబర్లో ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. ప్రస్తుతం సానియా భారత్ తరఫున బరిలోకి దిగుతోంది. వన్డే, టెస్టులకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్.. టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021కు కూడా అతడు ఎంపికయ్యాడు. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 35 టెస్ట్ మ్యాచ్లు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్లు ఆడాడు. యూనిస్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు 2009 ప్రపంచకప్ గెలిచింది. షోయబ్ మాలిక్ ఆ బృందంలో సభ్యుడు. 2007 వరల్డ్ కప్లో భారత్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. షోయబ్ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టులో సభ్యుడుగా ఉండటం విశేషం.