భారత్ : గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఏడాది భారత్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ ప్రాంతం వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను ఈసారి రద్దు చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వర్గాలు వెల్లడించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు వర్గాలలోని అధికారులు తెలిపారు. ఏటా నిర్వహించే రీట్రీట్ కార్యక్రమాన్ని ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
భారత సరిహద్దు దళం, పాకిస్థాన్ రేంజర్స్ సైనికులు కలిసి సుమారు 62 ఏళ్ళ నుంచి రీట్రీట్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా గత ఏడాది మార్చి 7 నుంచి అట్టారీ సరిహద్దుకు ప్రజలను అనుమతించడం లేదు. మరోవైపు చైనా రాజధాని బీజింగ్లో కరోనా వ్యాప్తి దృష్ట్యా భారత దౌత్య కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించుకునేందుకు కేవలం సిబ్బందికి మాత్రమే అనుమతినిచ్చారు.