రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసకుని రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రభుత్వం దారుణ పరాజయాన్ని చవి చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోగలిగింది రెండేళ్ల కిందటే ఇదే రోజున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి మూడునెలల కాలం నుంచే హామీలను నెరవేర్చడానికి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలు వేడుకలను జరుపుకొన్నారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. వైసీపీ సీనియర్ నేత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రొటోకాల్ ఉన్నందున పరిమితంగా దీన్ని నిర్వహించారు.
అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారని అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఆయన ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ కాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు. 20 ఏళ్లల్లో సాధించలేని అభివృద్ధిని రెండేళ్లలోనే వైఎస్ జగన్ చేసి చూపారని ప్రశంసించారు.
గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమాన్ని అందించామని చెప్పారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ సాకారం చేశారని చెప్పారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను రూపొందించారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏ సంక్షేమ పథకాన్ని ఎప్పుడు అమలవుతుందో.. ఎప్పటికప్పుడు క్యాలెండర్ను రూపొందించడాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులను వైఎస్ జగన్ తీసుకొచ్చారని, దీనికోసం ఆరు వేట్ల కోట్ల రూపాయలతో నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి తెచ్చి, ఆ స్థాయిలోనే విద్యను బోధిస్తోన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా జగన్ భావిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తాము భావిస్తున్నామని అన్నారు. అప్పుల భారం పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు.