ర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ వాగ్వాదానికి దిగారు. తనను ఏ కేసులో అరెస్టు చేయడానికి వచ్చారని రఘురామ నిలదీశారు. తమతో సీఐడీ కార్యాలయానికి వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం ఎంపీ రఘురామ పుట్టిన రోజు కావడం గమనార్హం. బర్త్డే రోజునే రఘురామను అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, బలవంతంగా తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని ఎంపీ రఘురామ కుమారుడు భరత్ తెలిపారు. 35 మంది వ్యక్తులు మఫ్టీతో వచ్చి, కనీసం వారెంట్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో తన తండ్రి రఘురామ బాధపడుతున్నారని, పుట్టిన రోజు నాడే అరెస్టు చేశారని తెలిపారు.
గత కొంతకాలంగా జగన్ సర్కార్పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.