ఐపీఎల్-2021 ప్రారంభానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒకరి కరోనా పాజిటివ్గా తేలిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే అతడిని ఐసోలేషన్లో ఉంచారు. మిగతా ఆటగాళ్లతో అతడిని కలవనీయలేదు. ఇక, తాజాగా కరోనా వైరస్ ఫీవర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పాకింది. ఆ జట్టు కీలక బ్యాట్స్మెన్ దేవ్దత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డారు.
గత ఐపీఎల్ సీజన్లో తనదైన బ్యాటింగ్తో పడిక్కల్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ సాధించడంతో పడిక్కల్ కీలక భూమిక పోషించాడు. ఇక, ఆర్సీబీ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 9వ తేదీన ముంబై ఇండియన్స్ ఆడాల్సి ఉంది. అయితే ఆర్సీబీ ఆడే తొలి రెండు మ్యాచ్లకు పడిక్కల్ దూరం కానున్నాడని సమాచారం. పడిక్కల్ అందుబాటులో లేకపోవడం ఒక రకంగా ఆర్సీబీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి.ఇక, కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న నితీశ్ రాణాకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. మార్చి 22న జరిపిన పరీక్షలో అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత అతడు ఐసోలేషన్లోకి వెళ్లాడు. అయితే ఇటీవల జరిపిన పరీక్షల్లో అతనికి కోవిడ్ నెగిటివ్గా నిర్ధారణ అయింది.
వాంఖెడే స్టేడియంలో కరోనా టెన్షన్..
ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే వాంఖెడే స్టేడియంలో నిర్వహించాల్సిన మ్యాచ్లను హైదరాబాద్కు తరలించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే కరోనా నేపథ్యంలో ఏర్పటు చేసిన బయో బబుల్ సౌకర్యాలను ఉన్నపళంగా మార్చలేమని.. ముంబైలో మ్యాచ్లను నిర్వహించడానికి ప్రయత్నిస్తామని బీసీసీఐ తెలిపింది.