బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ‘తలైవి’ మూవికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా కారణంగా త్వరలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం శుక్రవారం నాడు ప్రకటించింది. వాస్తవానికి ఈ నెలలో రెండో వారం గానీ, మూడో వారంలో గానీ ‘తలైవి’ సినిమా థియేటర్లలో విడుదల అవ్వాల్సి ఉంది. ఇంతలో ఈ చిత్రం విడుదలపై నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం.. వరుసగా ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తుండటంతో ‘తలైవి’ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
‘ఒక టీమ్గా ఈ సినిమా నిర్మాణం కోసం ఎన్నో త్యాగాలు చేశాము. ఛాలెంజింగ్ లాంటి ఈ ప్రయాణంలో సహకరించిన తారాగణం, సిబ్బంది సహా అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా బహుళ భాషల్లో నిర్మిండం జరిగింది. అన్ని భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయాలనుకుంటున్నాము. ఏప్రిల్ 23వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు పెరగడం, ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడం వంటి ప్రభుత్వ చర్యలకు మద్దతివ్వాలని నిర్ణయించాం. ఈ కారణంగానే ‘తైలవి’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి.’ అని చిత్ర బృందం ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘తలైవి’ సినిమాను ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. సినిమాలో జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. కంగనాతో పాటు.. అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్, భాగ్య శ్రీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.