డైట్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చిన ట్రోల్స్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాను శాకాహారినని ఎప్పుడూ చెప్పలేదని విమర్శకులకు ఘాటుగా బదులిచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోషాలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని కంట్రోల్గా తీసుకుంటానని తెలిపాడు.
ఇక విరాట్ గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్గా మారనని గతంలో చెప్పిన కోహ్లీ ఇప్పుడేలా గుడ్లు తింటున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. గతేడాది లాక్డౌన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో ఇన్స్టా వేదికగా లైవ్ సెషన్లో పాల్గొన్న విరాట్.. తన అనారోగ్య సమస్యల కారణంగా శాఖహారిగా మారినట్లు తెలిపాడు. వెన్నుముకలో తలెత్తిన సమస్య కారణంగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అది తనకు మేలు చేసిందని కూడా చెప్పాడు.
I never claimed to be vegan. Always maintained I'm vegetarian. Take a deep breath and eat your Veggies (if you want 😉)💪😂✌️
— Virat Kohli (@imVkohli) June 1, 2021
ఇక ఈ వ్యాఖ్యలనే ప్రస్తావించిన అభిమానులు విరాట్పై ట్రోలింగ్కు దిగారు. తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాఖాహారి అని చెప్పి కోహ్లీ గుడ్లు తింటున్నాడని ఒకరంటే.. గుడ్లు నాన్వెజ్ కాదనుకుంటా.. అని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లీ కూడా మనలానే మాట తప్పాడని మరొకరు సెటైర్ పేల్చాడు. ఈ ట్రోలింగ్పై స్పందించిన కోహ్లీ.. విమర్శకుల నోరు మూయించే ప్రయత్నం చేశాడు. ‘నేను వెజిటేరియన్ను అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికే అలానే ఉంటానని కూడా అనలేదు. గట్టిగా గాలి పీల్చుకొని మీ కూరగాయాలు మీరు తినండి’అని ఫన్నీ ఏమోజీలతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న కోహ్లీ.. ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. హార్డ్ క్వారంటైన్ ముగించికున్న అతను జిమ్లో చెమటోడ్చుతున్నాడు. బుధవారమే టీమిండియా.. ఇంగ్లండ్కు పయనం కానుంది. అక్కడ మరో 10 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనుంది. అయితే ఈ ఐసోలేషన్లో ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 18-22 వరకు న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఆడనున్న కోహ్లీసేన.. ఆగస్టు 4- సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది.