దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో అవార్డులు, పురస్కారాలను, మైలురాళ్లను చేరుకున్నారాయన. ఈ క్రమంలోనే కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన పేరు మీద ఉన్నన్ని అభిమాన సంఘాలు మరే హీరోకూ లేవు. అలాంటిది తాజాగా బాలయ్య ఓ అభిమానిని కొట్టారు. దీంతో సదరు బాధితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
టాలీవుడ్లోని స్టార్ హీరోల్లో బాలకృష్ణ అంత వేగంగా సినిమాలు చేసే హీరో మరొకరు లేరు అనేంతగా దూకుడు ప్రదర్శిస్తుంటారాయన. ఏడాది కనీసం రెండు సినిమాలనైనా తీసే నటసింహా 2019లో ఆయన ఏకంగా మూడు చిత్రాలతో నటించగా, అవన్నీ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. అయినప్పటికీ ఆయన వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.
కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న బాలకృష్ణ.. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ హిట్లను అందించిన బోయపాటి శ్రీనుతో మరోసారి జతకట్టారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇటీవలి కాలంలో బాలయ్యకు సరైన విజయం దక్కకున్నా.. ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమా కోసం ఆయన సరికొత్త బాడీ లాంగ్వేజ్తో కనిపించనున్నారు. అలాగే, ఇందులో కెరీర్లోనే తొలిసారి అఘోరా పాత్రలోనూ కనిపించబోతున్నారు. వీటితో పాటు ఈ మూవీతో హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నో సాహసాలు చేస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.
బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా పట్టాలపై ఉండగానే.. ‘క్రాక్’తో భారీ విజయాన్ని అందుకున్న ఎనర్జిటిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడైన బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తరచూ పార్టీ కార్యక్రమాలకూ హాజరవుతూ ఉంటారు. ఇందులో భాగంగానే తన నియోజకవర్గంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం ఆయన పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఓ అభిమానిపై ఈ నందమూరి హీరో చేయి చేసుకోవడం సంచలనం అయింది.
అభిమానిని బాలయ్య కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అన్ని మీడియా సంస్థల్లోనూ ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు బాధితుడు ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో ఎన్నో షాకింగ్ విషయాలను చెప్పాడు. అంతేకాదు, బాలయ్య కొట్టడం వల్ల తనకు సంతోషంగా ఉందంటూ రియాక్ట్ అయ్యాడు.
ఆ వీడియోలో ‘మేము టీడీపీ కార్యకర్తలం. బాలయ్య బాబు అభిమానులం. ఉదయం నుంచి అలసిపోయి ఉన్న ఆయన.. నన్ను వీడియో తీయొద్దని చెప్పారు. అయినా నేను తీస్తుంటే వచ్చి కొట్టారు. ప్రచారం మొత్తంలో కరోనా భయంతో ఎవరినీ టచ్ చేయని బాలయ్య.. నన్ను ముట్టుకోవడం సంతోషంగా, గర్వంగా ఉంది. దీనిపై నాకు ఏమాత్రం బాధ లేదు’ అంటూ చెప్పాడు ఆ కుర్రాడు.