మెగాస్టార్ చిరంజీవి తాన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ ఆందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజిన్ సిలెండర్లను ప్రత్యేక వాహనంలో గుంటూరు, అనంతపురం జిల్లాలకు తరలించారు. అనుకున్న ప్రకారం వారం రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ ట్రేటర్లను సేకరించామని.. బుధవారం రెండు జిల్లాలు.., గురువారంలోగా ఖమ్మం, కరీంనగర్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి తెస్తామని చిరంజీవి ప్రకటించారు. ఈ ఆక్సిజన్ బ్యాంకులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సేకరణలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించినట్లు చిరంజీవి తెలిపారు.
కరోనా కారణంగా చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో స్వయంగా తానే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని కొన్ని రోజుల క్రితం చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంకులను ఆయా జిల్లాల చిరంజీవి అభిమానల సంఘాల అధ్యక్షులు నిర్వాహకులుగా వ్యవహరిస్తారని రామ్ చరణ్ ప్రకటించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. మలయాళం సినిమా లూసీఫర్ రీమేక్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.