దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అగ్ర కథానాయకుల సినిమాలు సెట్స్పై సందడి చేస్తున్నాయి. బాలకృష్ణ ‘అఖండ’, మహేష్బాబు ‘సర్కారువారి పాట’, రామ్-లింగుస్వామి చిత్రం, అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాలు సోమవారం నుంచి చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.
ఐదు నెలల విరామం తర్వాత అగ్రకథానాయకుడు మహేష్బాబు కెమెరాముందుకొచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రీకరణ పునఃప్రారంభమైంది. పరశురామ్ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్లో ఫస్ట్షెడ్యూల్ను పూర్తిచేశారు. కమర్షియల్ హంగులకు సామాజికాంశాన్ని మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: మది, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.