విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇదివరకే మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ను అసెంబ్లీ ఆవరణలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. దీంతో విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గంటాకు కేటీఆర్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ఇది వరకే కేటీఆర్ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మార్చి 11న మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. ఈరోజు ఏపీలో అమ్ముతున్నారు..రేపు తెలంగాణలో అమ్మడం మొదలుపెడతారని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా అవసరమైతే విశాఖలో పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా అందరూ పోరాడాలని పిలుపిచ్చారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతామని చెప్పారు. దీంతో కేటీఆర్ విశాఖ ఎప్పుడు వెళ్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.