ఏపీ పంచాయతీ ఎన్నికల్లో దుమ్మురేపిన వైఎస్సార్సీపీ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. పురపాలికల్లో ఫ్యాన్ గాలి వీచింది. తాడిపత్రి, మైదుకూరు, బొబ్బిలి లాంటి కొన్ని మున్సిపాలిటీలు మినహా.. మిగతా చోట్ల ఫ్యాన్ గాలి వీచింది. విశాఖ ఉక్కు ఉద్యమం, అమరావతి సెంటిమెంట్ లాంటివేవీ వైసీపీ జోరుపై ప్రభావం చూపలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
కాగా అధికార పార్టీ విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెదిరింపుల కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. తమ పార్టీకి ఓటేయకపోతే.. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని ప్రజలను బెదిరించారని.. పెన్షన్లు, అమ్మఒడి, రేషన్ కార్డులను నిలిపేస్తామని భయపెట్టారని జనసేనాని ఆరోపించారు.
హైదరాబాద్లోని జనసేన ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల గుండెల్లో భరోసా నింపి వైసీపీ ఓట్లు సాధించలేదని.. కడుపు మీద కొట్టి.. తిండి లాక్కుంటామని బెదిరించి గెలిచిందని పవన్ ఆరోపించారు.