ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి సంబంధించి మ్యాచ్ ప్లేయింగ్ రూల్స్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పలు మార్పులు చేసింది. సాఫ్ట్ సిగ్నల్ను రద్దు చేసిన బోర్డు.. షార్ట్ రన్ను తేల్చే పనిని థర్డ్ అంపైర్కు అప్పజెప్పింది. ఏదైనా నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు రిఫర్ చేసినప్పుడు ఆన్ఫీల్డ్ ప్రధాన అంపైర్ చెప్పే అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ అంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్తో నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఔట్ విషయం ఇందుకు ప్రధాన ఉదాహరణ.
క్యాచ్ పట్టేప్పుడు బాల్ నేలకు తగిలినా స్పష్టత లేకపోవడంతో సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం ఔట్ ఇచ్చాడు. దీనిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఈ నిబంధనపై తీవ్ర చర్చ జరిగింది. దీన్ని మార్చాలనే డిమాండ్ వ్యక్తమైంది.
దాంతో ఈ నిబంధన మార్పుపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో సాఫ్ట్ సిగ్నల్ రూల్ను తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఫ్రాంచైజీలు కూడా సమాచారం ఇచ్చింది.
ఇక, రన్ చేసే క్రమంలో బ్యాట్స్మెన్ క్రీజును టచ్ చేయకుండా వెళ్లి పోతే దాన్ని షార్ట్రన్గా పరిగణించి ఆ పరుగును స్కోర్లోంచి తీసేస్తారు. ఇన్నాళ్లూ ఆన్ఫీల్డ్ అంపైర్లే దీన్ని గుర్తించాల్సి ఉన్నా చాలా సార్లు తప్పిదాలు చేశారు. దాంతో, షార్ట్ రన్స్ గుర్తించే బాధ్యతను కూడా బోర్డు థర్డ్ అంపైర్కే ఇచ్చింది.
గత సీజన్లో షార్ట్ రన్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్ చేసిన తప్పిదం కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అలియాస్ పంజాబ్ కింగ్స్ భారీగా నష్టపోయింది. అంపైర్ తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపడంతో పాటు ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది.
అలాగే, ఆన్ఫీల్డ్ అంపైర్లు ప్రకటించే నో బాల్స్పై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని సైతం థర్డ్ అంపైర్కు కట్టబెట్టింది. కాగా, మ్యాచ్ టై అయితే ఫలితం తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడించే రూల్లో కూడా బోర్డు మార్పులు చేసింది. కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక గంటలోపు మాత్రమే సూపర్ ఓవర్లు ఆడించాలని నిర్ణయించింది. అప్పటికే ఫలితం తేలకపోతే మ్యాచ్ను డ్రాగా ప్రకటించి చెరొక పాయింట్ ఇస్తారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రెండు సూపర్ ఓవర్లకు దారితీసింది. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ముగిసింది. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి అభిమానులను అలరించనుంది. భారత్ వేదికగానే జరగనున్న ఈ ధనాధన్ లీగ్.. కరోనా నేపథ్యంలో ఈ సారి 6 నగరాలకే పరిమితం కానుంది. మైదానాల్లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. చెన్నైవేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ సీజన్కు తెరలేవనుంది.
అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం వేదికగా.. ప్లే ఆఫ్ మ్యాచ్లతో పాటు మే 30న ఫైనల్ జరగనుంది. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ , అహ్మదాబాద్లను ఐపీఎల్కు వేదికలుగా ఎంపికచేశారు. అహ్మదాబాద్, ఢిల్లీలో 8, మిగిలిన నాలుగు వేదికల్లో 10 మ్యాచ్లు జరగనున్నాయి.