వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువ అవుతూ ఉంటారు. అందుకే ఆమె ఏం చేసినా క్రేజ్ ఉంటుంది. ఇటీవల గొర్రెల కాపరిగా మారిన ఆమె.. ఇఫ్పుడు వాలీబాల్ ప్లేయర్ అవతారం ఎత్తారు.
నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి తాజాగా ప్లేయర్ అవతారం ఎత్తారు. అది కూడా వాలీబాల్ ప్లేయర్ గా మారారు. జస్ట్ బాల్ పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాదు.. అక్కడ ఉన్నవారితో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి సందడి చేశారు.
తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో పలకలూరు గ్రామంలో పిల్లలు వాలీబాల్ ఆడుతుండడం గమనించిన ఆమె.. తాను కూడా వాలీబాల్ ఆడాలి అనుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కారు నుంచి కిందకు దిగారు. వాలీబాల్ కోర్టులోకి అడుగుపెట్టి స్ట్రయికింగ్ చేశారు. బాల్ లిఫ్ట్ చేయడంతో సహా.. సర్వీస్ కూడా సూపర్ గా చేశారు. ఆ పిల్లలతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి.. అందర్నీ ఉత్సాహ పరిచారు.
స్వయంగా ఎమ్మెల్యే అయి ఉండి వాలీబాల్ ఆడుతుండడంతో అటువైపు వెళ్తున్నవారంతా అక్కడ ఆగి కాసేపు ఆమె ఆటను చూసి ఆశ్చర్యపోయారు. అది కూడా చీరకట్టుతో ఉన్న ఆమె వాలీబాల్ ఆడడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఎమ్మెల్యే ఏంటి వాలీబాల్ ఆడుతున్నారు అనుకుంటూ అక్కడే ఆగిపోయారు.పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడటం ఏంతో ఆనందంగా ఉందన్నారు. తన చిన్న తనంలో తోటి స్నేహితులతో కలిసి ఆటలు ఆడిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ పిల్లలతో కలిసి ఆడటం ఏంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు, యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే శ్రీదేవి అభిప్రాయపడ్డారు.