ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ ఆలోచనలను కొందరు స్వాగతిస్తున్నారని, తమపై బురద చల్లాలని చూస్తే పవన్ కల్యాణ్కే అది ఇబ్బందిగా మారుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పవన్ కల్యాణ్ను సినీ పరిశ్రమలోని పెద్దలే గుది బండగా భావిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారని ఆయన విమర్శించారు.
పవన్ వంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా వారే భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆన్లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. దీని వల్ల పారదర్శకత వస్తుందని చెప్పారు. పవన్ కల్యాణ్ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం మటన్ షాపులు పెడుతుందన్న ప్రచారంలో నిజం లేదని, మటన్ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికలో మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.