కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అన్ని రకాల పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. చిత్రసీమ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అయితే.. ఇలాంటి విపత్కర సమయాల్లో స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా తమ ఉదారత చాటుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి అగ్రకథానాయకులతో పాటు ఇతర హీరోలు కూడా ముందకు వచ్చి తమవంతు సాయంగా పేదలను ఆదుకుంటున్నారు. తాజాగా ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ భారీ విరాళం ప్రకటించాడు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి పనుల్లేక ఇబ్బంది పడుతున్న కన్నడ సినిమా కార్మికులకు నేనున్నానంటూ అభయమిచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలా దాదాపు 3వేల మందికి ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
‘‘కొవిడ్19 మన దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవనోపాధిని దెబ్బతీసింది. అందులో నా సొంత ఇండస్ట్రీ కన్నడ చిత్రసీమ కూడా ఉంది. ఇలాంటి కష్టకాలంలో మొత్తం 21 విభాగాల కార్మికులకు నేను నా సంపాదన నుంచి రూ.5000 విరాళంగా ప్రకటిస్తున్నాను. నేను చేస్తున్న ఈ సాయం నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదని నాకు తెలుసు. కానీ.. త్వరలోనే చిత్రసీమ తిరిగి కోలుకుంటుందన్న ఆశతో నా వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నా’’ అని యశ్ పేర్కొన్నారు.
#togetherwestand #humanity pic.twitter.com/46FYT9pThz
— Yash (@TheNameIsYash) June 1, 2021