తమిళంలో వివాదరహితమైన నటులలో హీరో అజిత్ ముందుంటాడు. ఎక్కడకి వెళ్లినా పెద్దగా హడావుడి కూడా లేకుండా చూసుకొనే అజిత్ వివాదాలకు ఆమడదూరం ఉంటాడు. ఇండస్ట్రీలోనే సౌమ్యుడిగా అజిత్ కు పేరు. అయితే.. అలాంటి అజిత్ ఇంటి ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోటీపై కిరోసిన్ పోసుకొని తన చావుకి అజితే కారణమని హల్చల్ చేసింది. పోలీసులు స్పందించి ఆమెపై నీళ్లు పోసి ఆమెని రక్షించగా ఈ వార్త మాత్రం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఇందులో అజిత్ ప్రమేయం కానీ.. అజిత్ ఒత్తిడులు కానీ ఏదీ లేదు. గతేడాది కరోనా మహమ్మారి తమిళనాడును వణికిస్తున్న సమయంలో అజిత్ భార్య షాలినితో కలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే ఫర్జానా అనే మహిళ అజిత్, షాలినిలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు, సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు ప్రచారం చేశాయి.
దీంతో వీడియో తీసి పోస్ట్ చేసిన ఫర్జానా హాస్పిటల్ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఆమెని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అయితే అజిత్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి వస్తుందనే ఆశతో ఆమె పలుమార్లు అజిత్ ను కలవడానికి ప్రయత్నించింది. కానీ ఆ అవకాశం రాలేదు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు అజిత్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు స్పందించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెని ఇంటికి పంపించేశారు.