బాలీవుడ్ తార సన్నీలియోన్ భారత్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గూడు ఏర్పాటు చేసుకుంది. అదేనండి సొంతిళ్లు కొనుగోలు చేసింది. ముంబైలోని అంధేరి సబర్బన్లో సన్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చదరపు అడుగుల అపార్టుమెంట్ కొనుగోలు చేసింది. దీనికోసం సన్నీలియోన్ మార్చి 28న రూ.48 లక్షలు స్టాంప్ డ్యూటీ పే చేసినట్టు రికార్డుల్లో నమోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు (12వ అంతస్థు) అట్లాంటిస్కు క్రిస్టల్ ప్రైడ్ డెవలపర్స్ డిజైన్ వర్క్స్ చేశారు.
భవనంలో మూడు మెకనైజ్డ్ కారు పార్కింగ్ సౌకర్యం ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. అంతేకాదు సన్నీలియోన్ తన అసలు పేరు కరణ్జిత్ కౌర్ వోహ్రా పేరుతో ఈ ప్లాట్ను రిజిస్టర్ చేయడం విశేషం. సన్నీలియోన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా ఇన్నాళ్లకు ఇండియాలో తనకంటూ ఓ సొంతింటిని నిర్మించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సన్నీ ఫాలోవర్లు.