తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, తన సహోదరి జయలలిత మరణాంతరం జైలు జీవితం గడుపుతున్న శశికళ గారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు.
బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. బోరింగ్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో పాటు రక్తపోటు, మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయని తేలింది. శశికళ ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.
2016లో జయలలిత మరణానంతరం శశికళ తన సహోదరి స్థానాన్ని పొందడానికి చాలా ఎత్తులు పై ఎత్తులు వేశారు. అయితే ఎప్పటి నుంచో కోర్టులో జరుగుతున్న అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టయ్యారు. దీంతో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు 10 కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే శశికళ విడుదల కాబోతున్నారు.