ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపీ సీఎం వైస్ జగన్ (AP CM YS Jagan) సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) కొత్త పార్టీ అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా షర్మల పార్టీ గురించే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపీ సీఎం వైస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా షర్మల పార్టీ గురించే చర్చ జరుగుతోంది. ఐతే ఆమె కొత్తపార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వైఎస్ జగన్ మద్దతు ఉందా..? లేదా? అనే సస్పెన్స్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరదించింది. షర్మిల పెట్టబోయే పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు అనేది షర్మిల వ్యక్తిగత నిర్ణయమని సజ్జల తెలిపారు. తెలంగాణలో వైసీపీని విస్తరించాలన్న ఆలోచన జగన్ కు లేదని.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయన్నారు. పార్టీ వద్దని జగన్ చెప్పినా వినకుండా షర్మిల పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు సజ్జల.
షర్మిల పార్టీ పెట్టాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని.. ఈ క్రమంలో సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు వద్దని వారించినా షర్మిల తన వ్యక్తిగత నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇప్పుడు కానీ, భవిష్యత్తులోగానీ తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి తమ మద్దతు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. పార్టీ ఏర్పాటులో వచ్చే లాభనష్టాలు, లోటుపాట్లు, ఇతర పార్టీల నుంచి వచ్చే ఒత్తుడులు ఇలా అన్ని అంశాలకు షర్మిలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారాయన. షర్మిల పార్టీ పెట్టినా ఏపీ ప్రయోజనాలే సీఎంకు ముఖ్యమని చెప్పారు.
దవుల విషయంలో వైఎస్ జగన్ తో వచ్చి విభేదాల కారణంగానే షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలను సజ్జల కొట్టిపారేశారు. షర్మిలకు పదవి ఇస్తే కుటుంబ పాలన సాగుతోందన్న విమర్శలు వచ్చే అవకాశముందన్నారు. రాజకీయపరంగా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్తపార్టీ పెడితే వచ్చే అనవసర ఇబ్బందులెందుకని జగన్ అన్నారని.. తెలంగాణలో పాదయాత్ర చేసిన కారణంగా అక్కడ ప్రజల మద్దతుంటుందని వెళ్తానని షర్మిల స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, తాను తీసుకొస్తానని షర్మిల చెప్పారు. ‘నేను మీ రాజన్న కూతురు షర్మిలని’ అని వైఎస్ఆర్ అభిమానులకు మరొక్కసారి గుర్తుచేసిన షర్మిల ఫేస్బుక్ పోస్ట్ను ముగించారు. అభిమానులకు చెప్పకుండా కొత్త పార్టీ పెట్టనని, అందరితో చర్చించాక ప్రకటన చేస్తానని షర్మిల చెప్పినప్పటికీ ఆమె పార్టీ పేరును వీలైనంత త్వరలో రిజిస్టర్ చేయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, వైఎస్ఆర్ కలిసొచ్చేలా షర్మిల పార్టీ పేరు ఉండబోతున్నట్లు సమాచారం. షర్మిల కొత్త పార్టీ పేరుపై తాజాగా ఓ ప్రచారం కూడా జరుగుతోంది.
షర్మిల కొత్త పార్టీ పేరు ‘వైఎస్సార్టీపీ’ అని షర్మిల టీం సూచనప్రాయంగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్కు ఈ మేరకు దరఖాస్తు చేసేందుకు సన్నాహాలు కూడా మొదలైనట్లు సమాచారం. ‘వైఎస్ఆర్ రాజన్న రాజ్యం’ అనే పేరు కూడా వినిపిస్తోంది. ఏదేమైనా షర్మిల మంగళవారం నాడు వైఎస్ఆర్ అభిమానులతో నిర్వహించిన సమావేశం అనేక చర్చలకు తావిచ్చింది. అయితే.. షర్మిల పార్టీ వెనుక జగన్ వ్యూహం కూడా ఉందన్న ప్రచారం కూడా తెరపైకొచ్చింది. వైసీపీకి తెలంగాణలో ఆంధ్రా పార్టీగా ముద్ర ఉన్న నేపథ్యంలో నేరుగా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితి లేదు.