కొవిడ్ తర్వాత సినీపరిశ్రమ ఇంకా పూర్తిగా కోలుకోని సమయంలో ‘ఉప్పెన’ చిత్రానికి ఇంత పెద్ద విజయం అందించి తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణం పోశారని ప్రముఖ కథానాయుడు రామ్చరణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం రాత్రి జరిగిన ‘ఉప్పెన’ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే రాష్ట్రాల్లో సినిమాలను విడుదల చేయడానికి భయపడుతుంటే ధైర్యంగా మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్, రవి ఈ చిత్రాన్ని విడుదల చేశారంటే మన అభిమానులు, సినిమా ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకమే కారణమన్నారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ… ఇలాంటి కథని నమ్మిన ఘనత మెగాస్టార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. ఈ విజయం చిరంజీవికి అంకితమన్నారు. నిర్మాతలకు, తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువు, దర్శకుడు సుకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. హీరో వైష్ణవ్తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, రాజమహేంద్రవరం ఎంపీ భరత్రామ్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.