స్టార్ డైరెక్టర్ శంకర్ నివాసంలో రామ్చరణ్ సందడి చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. రామ్చరణ్ 15వ చిత్రంగా అది రూపుదిద్దుకోనుంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైకి చేరుకున్న రామ్చరణ్, నిర్మాత దిల్రాజు.. శంకర్ ఇంటికి వెళ్లారు. తమ ప్రాజెక్ట్ని ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించాలి? ఇతర నటీనటుల గురించి ఈ ముగ్గురూ చర్చించుకున్నారు.
‘చెన్నైలో నిన్న ఎంతో సరదాగా గడిచింది. మాకు చక్కని ఆతిథ్యం అందించిన శంకర్, ఆయన కుటుంబసభ్యులకు ధన్యవాదాలు. RC15.. ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అతి త్వరలో అప్డేట్స్ ఇస్తాం’ అని చెర్రీ ట్వీట్ చేశారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్చరణ్ సరసన కియారా అడ్వాణీ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తమన్ స్వరాలు అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు.