“ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను… అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను…’’ అంటూ పాడుకున్నాడు రౌడీబాయ్. అతని ప్రేమకథేమిటో తెలియాలంటే ‘రౌడీ బాయ్స్’ చూడాల్సిందే. ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో గీతమైన ‘ప్రేమ ఆకాశమైతే…’ని బుధవారం యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలోని ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, జస్ప్రీత్ జస్జ్ ఆలపించారు. ఈ పాట విడుదల కోసం హైదరాబాద్లో ఓ వేడుకని నిర్వహించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో దిల్రాజు నిర్మాణంలో సినిమా చేయనున్నట్టు తెలిపారు.