మాటకారి మంగ్లీగా ఓ న్యూస్ ఛానెల్లో కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ ఆ తర్వాత తన ప్రతిభతో మంచి సింగర్గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు పెద్ద హీరోల సినిమాల్లో తన పాటలతో అలరిస్తోంది. ఇప్పటికే ఈమె ‘అల వైకుంఠపురుములో’లో రాములో రాములా పాటతో పాటు నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘లవ్ స్టోరీ’లో పాడిన సారంగదరియా పాట యూట్యూబ్ను ఓ రేంజ్లో షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు మంగ్లీ సినిమా సాంగ్స్ మాత్రమే కాకుండా.. వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక గీతాలు పాడటమే కాకుండా అందులో నటించి ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ఈమె పాడే ప్రత్యేక భక్తి గీతాలకు యూట్యూబ్లో ఇప్పటికే లక్షలాది…కోట్లాది వ్యూస్ సంపాదించాయి. ఈమె పాడే పాటలకు ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈమె బోనాల సందర్భంగా పాడిన పాట ఇపుడు వివాదానికి కారణమైంది.
ఈ పాటకు రామస్వామి లిరిక్స్, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. మంగ్లీ ఆ పాటను పాడడంతో పాటు స్క్రీన్పై కూడా తానే కనిపించారు. ఢీ ఫేమ్ పండు కొరియోగ్రఫీ చేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనూ మిలియన్స్ వ్యూస్ సంపాదించుకున్న ఆ పాటపై ప్రస్తుతం వివాదం నెలకొంది. బోనాల సందర్భంగా అమ్మవారిపై మంగ్లీ పాడిన పాటల్లో కొన్ని తప్పుడు పదాల ఉపయోగించరాని వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచిన పాటల్లోంచి వెంటనే తొలగించాలని కోరుతున్నారు. చెట్టు కింద కూసున్నవమ్మా, సుట్టం లెక్క మైసమ్మ అంటూ సాగే ఈ పాట ఇపుడు వివాదానికి కేంద్రబిందువు అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రాజకొండ పోలీస్ కమిషనర్ను కలిసి ఈ పాటపై ఫిర్యాదు చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని కోరారు. అంతేకాదు ఆమె పాడిన పాటను సామాజికి మాధ్యమాల నుంచి తొలిగించాలని డిమాంజ్ చేశారు.