ఎప్పుడూ పరిశ్రమలు, ఐటీ, పట్టణ ప్రగతి అంటూ మాట్లాడే మంత్రి కేటీఆర్ చాలా రోజుల తర్వాత వ్యవసాయం గురించి తన అభిప్రాయాలను తెలిపారు. కొత్త తరం వ్యవసాయం పై మక్కువ పెంచుకోవాలని సూచించారు. యువతరం వ్యసాయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. అవసరమయితే రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత నేటి తరానికి ఉందన్నారు కేటీఆర్. వ్యవసాయం అంశంతో ప్రధానాంశంగా తెరకెక్కిన ‘శ్రీకారం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.
వ్యవసాయం అనే మాటలో వ్యయం ఉంది… సాయం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యయం పెరిగిపోయింది, సాయం తగ్గిపోయిందన్నారు కేటీఆర్. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉందన్నారు. రైతుకు సాయం చేసే పరిస్థితులు రోజురోజుకి తగ్గిపోతున్నాయన్నారు. అందువల్లే డాక్టర్ కొడుకు డాక్టర్, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నట్టు రైతు కొడుకు రైతు కావడం లేదన్నారు కేటీఆర్. అగ్రికల్చర్లోనే కల్చర్ ఉన్నా ఇప్పుడా కల్చర్ని అందరం మరిచిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
కేసీఆర్కి వ్యవసాయం అంటే ఎంతో మక్కువని చెప్పారు కేటీఆర్. అందువల్లే రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ సమయంలో అన్ని పనులు బందైనా.. ఆగనిది వ్యవసాయరంగమే అన్నారు. కానీ ఇప్పుడు భూమిని నమ్ముకున్నవాడికంటే అమ్ముకున్న వాడే ఎక్కువ బాగుపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కొత్త తరం వ్యవసాయం పై మక్కువ పెంచుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. చివరగా జై జవాన్.. జై కిసాన్ అంటూ ప్రసంగం ముగించారు కేటీఆర్.