నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్స్టోరి’. తెలుగునాట ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. మారుమూల పల్లెల నుంచి వచ్చిన రేవంత్, మౌనికలు తమ కలల్ని, ప్రేమను ఎలా సాధించుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన ఫీల్గుడ్ మూవీ ఇది. పలు సామాజిక సమస్యలను ఇందులో చర్చించారు. నటుడిగా నాగచైతన్యకి, దర్శకుడిగా శేఖర్కమ్ములకి మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఈ కథాంశం మలయాళ ప్రేక్షకులనూ అలరిస్తుందనే ఉద్దేశంతో కేరళలోనూ విడుదల చేస్తున్నారు. అక్కడ ‘ప్రేమతీరం’ పేరుతో ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవికి మాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ‘ప్రేమమ్’ సినిమా నుంచి ఆమెకు అక్కడ ప్రత్యేక అభిమానులున్నారు. నాగచైతన్య ‘ప్రేమతీరం’తో మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.