‘సినీ పరిశ్రమ నలుగురు దర్శకనిర్మాతలకు చెందినది కాదు. ఒకరి బెదిరింపులకు ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదు. ఒక వ్యక్తిని, సినిమాను దృష్టిలో పెట్టుకొని కాకుండా చిత్రసీమ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. ఆదివారం హైదరాబాద్లో ‘ఆటో రజనీ’ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతిసేన్గుప్తా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సావిత్రి నిర్మిస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్లాప్నివ్వగా, కొడాలి నాని కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ‘పవన్కల్యాణ్ను టార్గెట్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. పవన్ బెదిరింపులకు మేము భయపడం’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రెండు నెలల్లో షూటింగ్ను పూర్తిచేస్తాం’ అని తెలిపారు. చక్కటి సందేశాత్మక చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు.