తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ కోఆర్డినేటర్ ఓ పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ (63) బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ల ఆమె గుండెపోటు రావడంతో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
మాజీ సీఎం సతీమణి విజయలక్ష్మీ గత రెండు వారాలుగా గుండెపోటుతో చెన్నై నగరంలోని పెరుంగుడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆమె చికిత్సలో ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మీ బుధవారం కన్నుమూశారు. విజయలక్ష్మీ మృతి పట్ల మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి విజయభాస్కర్ సంతాపం తెలిపారు. విజయలక్ష్మీ కుమారుడు ఓపీ రవీంద్రనాథ్ ఎంపీగా ఉన్నారు. మాజీ సీఎం భార్య విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆమె మృతదేహాన్ని పన్నీర్సెల్వం స్వస్థలమైన పెరియకుళానికి తీసుకువెళతారు. విజయలక్ష్మీ అంత్యక్రియలు గురువారం జరిగే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి దురై మురుగన్, తంగం తెన్నరాజు, పికె శేఖర్ బాబు, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి, అన్నాడీఎంకే సీనియర్ కార్యకర్తలు విజయలక్ష్మి భౌతిక కాయానికి ఆసుపత్రిలో నివాళులర్పించారు. విజయలక్ష్మి మరణవార్త విని, రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకున్నారు.