హుజూరాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అని వార్యమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది. అంతే కాదు దళిత బంధు లాంటి కొత్త పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
ఈ క్రమంలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని వెల్లడించారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందని విమర్శించారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తే ఖచ్చితంగా స్పీకర్ దగ్గరకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.