పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాను జయించారు. ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. వైద్య సేవలు అందించిన డాక్టర్లు..మూడు రోజుల కిందట..ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారని, ఇందులో నెగటివ్ వచ్చిందని తెలిపింది.
కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని, ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపినట్టు జనసేన ప్రకటించింది. తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్ధనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు జనసేన తెలిపింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావ తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
‘వకీల్ సాబ్’ యూనిట్ సభ్యులతో పాటు భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్కు పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఏప్రిల్ 16వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/CbYXFRnGLC
— JanaSena Party (@JanaSenaParty) May 8, 2021