దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపిస్తున్నారంటూ కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక సమాచారం తెరపైకి వచ్చింది. రేపు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని బ్రదర్ అనిల్ కార్యాలయంలో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి తరలి రావాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. దాదాపు అన్ని మీడియా చానళ్లు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అయితే దీనిపై తమకు సమాచారం లేదని తెలంగాణ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ప్రస్తుతం వైఎస్ షర్మిల బెంగళూరులో ఉండగా, ఈ సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.