పాణ్యం నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యల వెనుక పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ పై కాటసాని మండిపడ్డారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని… లేకపోతే ఆయన కథ చూస్తామని హెచ్చరించారు. రెచ్చగొట్టేలా లోకేశ్ మాట్లాడుతున్నారని అన్నారు.
వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్… ఒక జోకర్ వంటి వాడని కాటసాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. తిట్టాలనుకుంటే తాము కూడా తిట్టగలమని… కాకపోతే ఆ సంస్కృతి తమకు లేదని చెప్పారు. లోకేశ్ ట్విట్టర్లో తప్ప ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని అన్నారు.
హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని కాటసాని అన్నారు. లోకేశ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని… వైయస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో చూసి లోకేశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. పులికి పులి బిడ్డ పుట్టిందని… నక్కకు నక్క బిడ్డ పుట్టిందని ఎద్దేవా చేశారు.