ఈ ఏడాది ప్రేక్షకులు… పరిశ్రమ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి ‘కె.జి.ఎఫ్2’. రాఖీ భాయ్గా మరోసారి యశ్ చేయనున్న సందడిని ఆస్వాదించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. విజయవంతమైన ‘కె.జి.ఎఫ్’కి కొన సాగింపుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనాతో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీపై దృష్టిపెట్టారు.
కరోనా కేసుల తీవ్రతని…థియేటర్ల దగ్గర పరిస్థితుల్ని అంచనా వేస్తూ విడుదలకి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావడం, నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకోవడంతో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది చిత్రబృందం. సెప్టెంబరు 9న చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మరి సినీ వర్గాలు అదే రోజునే విడుదలని ఖరారు చేస్తుందా? నిర్ణయం మార్చుకుంటుందా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.