హీరోయిన్లు కంగన రనౌత్, తాప్సీ పన్ను మరోసారి ట్విట్టర్ వేదికగా గొడవ పడ్డారు. అప్పట్లో తాప్సీపై కంగన కామెంట్స్ చేయడం, వాటికి తాప్సీ కూడా ఘాటు సమాధానం ఇవ్వడంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రైతుల ఉద్యమం నేపథ్యంలో తాజాగా వారిద్దరు పరస్పరం విమర్శలు చేసుకోవడం గమనార్హం.
రైతుల నిరసనలపై పాప్ సింగర్ రెహన్నే చేసిన ట్వీట్పై కంగన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రైతుల ఉద్యమంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడే స్పందించాలని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలోనే కంగన వ్యాఖ్యలపై తాప్సీ స్పందించింది. ఓ ట్వీట్ ఐక్యతను దెబ్బతీసిందంటున్నారని చెప్పింది.
విలువలను, వ్యవస్థను బలపరిచేందుకు పని చెయ్యాలి తప్ప ఇతరులకు పాఠాలు నేర్పే టీచర్గా మారకూడదంటూ తాప్సీ ట్వీట్ చేసింది. తాప్సీ ట్వీట్పై కంగనా స్పందిస్తూ… బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయని తెలిపింది. అటువంటి వారి ఉచిత సలహాలను వినొద్దని, వాటి వల్ల దేశానికి ఉపయోగం ఉండదని చెప్పింది.
అందుకే వారిని తాను బీ గ్రేడ్ అని పిలుస్తానని తెలిపింది. దీంతో వారి ట్వీట్ల స్క్రీన్ షాట్లను నెటిజన్ లు వైరల్ చేస్తున్నారు. ఈ ట్వీట్లు అంత విషపూరితంగా, వివాస్పదంగా లేకపోతే బాగుండేవంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో దానిపై తాప్సీ స్పందిస్తూ విషం అనేది వారి డీఎన్ఏలోనే ఉండొచ్చంటూ కామెంట్ చేసింది. అలాగే, ఆర్ఎన్ఏ, ప్లేట్లెట్స్పై కూడా ఉండొచ్చని పేర్కొంది