కండలవీరుడిగా పేరొందిన బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ గాయకుడిగా మారాడు. ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ పాటని తాజాగా విడుదల చేశారు. విశాల్ మిశ్రా స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి కౌశల్ కిశోర్ సాహిత్యం అందించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. ‘హిందూస్థాన్ మేరీ జాన్’ అంటూ ప్రారంభమైన ఈ పాట భారతీయులందరినీ హత్తుకునేలా ఉంది. ష్రాఫ్ గానం, నాట్యం అలరిస్తున్నాయి. లొకేషన్లు ఆకట్టుకుంటున్నాయి. ‘ఇది కేవలం పాట మాత్రమే కాదు ఓ భావోద్వేగం. ఈ గీతాన్ని దేశానికి అంకితమిస్తున్నా’ అని తెలిపాడు ష్రాఫ్. ‘హీరోపంటి’ చిత్రంతో నటుడిగా మారిన ఆయన ‘వార్’, ‘భాగీ’ సిరీస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.