నందమూరి బాలకృష్ణ సినిమాలంటే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆయన ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టకొనే చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్కి చెందిన పలువురి నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘కేజీయఫ్2’లో నటిస్తోన్న సంజయ్ దత్ పేరు తొలుత ప్రస్థావనకు వచ్చింది. అయితే తాజాగా ఆ స్థానంలో సునీల్ శెట్టి పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు త్వరలోనే ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.
సునీల్ ఆ మధ్య కన్నడ నటుడు కిచ్చా సుదీప్తో కలిసి ‘పహిల్వాన్’ చిత్రంలో నటించి అలరించారు. ఇక తెలుగులో మంచు విష్ణుతో కలిసి ‘మోసగాళ్లు’ చిత్రం చేస్తున్నారు. ఓ విధంగా చూస్తే తెలుగు తెరకు సునీల్ కొత్తేమీ కాదు అనే భావన కూడా వస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘బీబీ3’గా రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. ఈ సినిమాను మే 28, 2021న విడుదల చేయనున్నారు