తన భర్త రాజ్కుంద్రా అరెస్ట్ గురించి ఎట్టకేలకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెదవి విప్పారు. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు సృష్టించవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకి పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విటర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నిజమే!! గత కొన్నిరోజలుగా ప్రతి విషయంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్కుంద్రా అరెస్ట్ వ్యవహరంపై ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై ఇప్పటివరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలనుకోవడం లేదు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే, దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి. నా పేరుతో ఇష్టం వచ్చినట్లు కథనాలు సృష్టించకండి. అంతేకాకుండా, ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను. అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్లు చేయకండి’’ అని శిల్పాశెట్టి అన్నారు.
అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రాను జులై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఇటీవల శిల్పాశెట్టిని సైతం విచారించారు. అయితే విచారణ సమయంలో ఇంటికి వచ్చిన కుంద్రాను చూసి శిల్పిశెట్టి కన్నీళ్లు పెట్టుకుని వాగ్వాదానికి దిగిందని కొన్నిరోజుల క్రితం నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
My statement. pic.twitter.com/AAHb2STNNh
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 2, 2021