తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో దీక్షలకే పరిమితమైన షర్మిల వచ్చే నెల నుంచి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో సీనియర్లు లేకపోవటం..క్షేత్ర స్థాయిలో బలం లేకపోవటం ఆ పార్టీకి మైనస్ గా ప్రచారం సాగుతోంది. అయితే, పాదయాత్ర నుంచి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని షర్మిల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. వచ్చే నెల 20వ తేదీ నుంచి తన తండ్రి తరహాలోనే చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మినహా మొత్తంగా 90 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. దాదాపుగా ఏడాదికి పైగా తన యాత్ర సాగే అవకాశం ఉందని షర్మిల చెబుతున్నారు. అయితే, షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. కాంగ్రెస్..బీజేపీ లను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికే ఆ మూడు పార్టీలకు క్షేత్ర స్థాయిలో కేడర్ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో షర్మిల తన తండ్రి లెగసీనే నమ్ముకుంటున్నారు. ఈ సమయంలోనే వైఎస్సార్ ఇమేజ్ ఓన్ చేసుకోవటంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పోటీ పడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంటూ వైఎస్సార్ అభిమానులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, తెలంగాణలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించేలా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా షర్మిల వెల్లడించారు. అందులో భాగంగా.. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం సభ్యులతో షర్మిల లోటస్ పాండ్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు. పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండాలి..ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశం పైన చర్చలు జరుగుతన్నట్లుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్ అండ్ పార్టీని ఏ రకంగా టార్గెట్ చేయాలి..ఏఏ అంశాలు ప్రస్తావించాలనే దాని పైన కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అదే విధంగా కాంగ్రెస్ – బీజేపీ పైన ఎటువంటి వ్యూహాలు అయలు చేయాలనేది ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ తో పాటుగా ఆయన టీం పని చేసింది. జగన్ పాదయాత్ర సమయంలో జగన్ తో పాటుగానే టీం ఫాలో అయింది. ఆ సమయంలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించారు.
అభ్యర్ధుల ఎంపిక సమయంలోనూ జగన్ కు సమాచారం ఇచ్చారు. ఇక, ఇప్పుడు అదే తరహాలో ప్రశాంత్ కిషోర్ టీం షర్మిలకు సేవలు అందించేందుకు సిద్దంగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..షర్మిలతో ఐ ప్యాక్ టీంల సమవేశాలు ఒక వరుసగా జరిగే అవకాశం కనిపిస్తోంది. పాదయాత్ర ప్రారంభం సమయానికే పార్టీ పరంగా పక్కా వ్యూహం సిద్దం చేసుకొని ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లటం పైన చర్చించినట్లుగా తెలుస్తోంది.