యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే ప్రధాన పాత్రలతో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేటర్లో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. కానీ, అప్పటికి ఇప్పుడున్న కరోనా పరిస్థితులు చక్కబడతాయా అంటే డౌటనే చెప్పాలి. అందుకే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా ఇంతకు ముందు నిర్మాతలు చెప్పిన తేదీనే థియేటర్లతో పాటు డిజిటల్ లో కూడా ఒకేసారి విడుదల చేస్తారని చెప్తున్నారు.
సినిమా అంటే థియేటర్.. థియేటర్ అంటే సినిమా కరోనాకు ముందు పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ నుండి బడా బడా పాన్ ఇండియా సినిమాల వరకు ఓటీటీలో ఎప్పుడొస్తుంది అనే పరిస్థితి. ప్రేక్షకులు ఓటీటీలో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే బయట కరోనా కాలం. థియేటర్లు తీసే పరిస్థితి లేదు. ఒకవేళ తీసినా ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లే ధైర్యం చేయడం లేదు. దీంతో ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యే సినిమాలన్నిటినీ దర్శక, నిర్మాతలు వాయిదా వేసుకొని కూర్చున్నారు.
కంటెంట్ బేస్, కథా బలం ఉన్న సినిమాలకు, చిన్న బడ్జెట్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉండగా.. ఆ నిర్మాతలకు కూడా ఈ సినిమాలను ఓటీటీలకు ఇచ్చేయడం గిట్టుబాటు అవుతుంది. కానీ బడా బడ్జెట్ సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు ఇది ఎంత వరకు గిట్టుబాటు అవుతుందనే భయం ఉంటుంది. అయితే.. బాలీవుడ్ కండల వీరుడు, వందల కోట్ల కలెక్షన్లు సాధించే హీరో సల్మాన్ ఖాన్ తాజా సినిమా రాధే ఇప్పుడు థియేటర్లో, డిజిటల్ లో ఒకేసారి విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇటు థియేటర్లు, అటు డిజిటల్ లో ఒకేసారి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు వారికి కావాల్సిన పద్దతిలో సినిమా చూసే ఛాన్స్ దక్కుతుంది. డిజిటల్ లో అంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో అనమాట. ఈ నెల 13న సల్మాన్ రాధే పే ఫర్ వ్యూ విధానంలోనే విడుదల కానుంది. కాగా, ఇప్పుడు ఇదే పద్ధతిలో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా విడుదల చేస్తారని ప్రచారం మొదలైంది. కానీ, దీని మీద సినిమా యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేదు. మరి నిజంగానే రాధేశ్యామ్ తో తెలుగులో ప్రభాస్ కొత్త శకానికి నాంది పలుకుతారా? లేక థియేటర్లు ఓపెన్ చేసేవరకు వేచిఉంటారా అన్నది చూడాల్సి ఉంది.