ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ రాజు దంపతులకు ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు తెలిపారు. వారి ఇంటికి వెళ్లిన రోజా.. బిడ్డను ఎత్తుకుని ఆమెను ఆశీర్వాదించారు. రోజాను శాలువాతో శ్రీవాణి సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తల్లయిన విషయం తెలిసిందే. పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ రాజు దంపతులకు వారం రోజుల క్రితం పండంటి పాప జన్మించింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పుష్ప శ్రీవాణి కాన్పు జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరవాత విజయనగరంలోని ఇంటికి పుష్ప శ్రీవాణి వెళ్లిపోయారు. అయితే, తల్లీబిడ్డలను చూసేందుకు ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శనివారం విజయనగరం వెళ్లారు.
పుష్ప శ్రీవాణి ఇంటికెళ్లిన రోజా.. దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఊయలలో ఉన్న పాపకు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. తన చేతుల్లోకి తీసుకుని కాసేపు ఆడించారు. పుష్ప శ్రీవాణితో కాసేపు మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి విజయనగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పైడితల్లి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.