ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్న చిరంజీవి అక్టోబర్ 1న రాజమండ్రికి పయనం కానున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించేందుకు అక్కడికి వెళుతున్నారు.
ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చిరు పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి ఈ వివాదానికి సంబంధించి ఏదైన వ్యాఖ్యలు చేస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న సినీ నిర్మాతల భేటి అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తనతో మాట్లాడరని, ఆడియో ఫంక్షన్లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. పరిశ్రమను బతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్దమని నిర్మాతలు చెప్పారని మంత్రి చెప్పారు.