కీర్తి సురేష్ సినిమా మీద ఇప్పుడు రూమర్లు ఎక్కువవుతున్నాయి. తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో పాగల్, నితిన్ కొత్త సినిమా, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి వంటి సినిమాలు ఓటీటీలో రాబోతోన్నట్టు టాక్ వస్తోంది. ఇప్పటికే కీర్తి సురేష్ సినిమాలైన పెంగ్విన్, మిస్ ఇండియా వంటివి ఓటీటీలోనే వచ్చాయి. గత ఏడాది వచ్చిన ఈ చిత్రాలు దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకున్నాయి.
అలా ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో రాబోతోందనే రూమర్ బయటకు వచ్చింది. జగపతి బాబు, ఆది, కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్ ఇలా అన్నీ మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ చిత్రం ఓటీటీలో రాబోతోందనే రూమర్లను నిర్మాతలు తాజాగా ఖండించారు. మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తం.. వాటిని నమ్మకండి.. ఇంకా ఏమీ అనుకోలేదు.. ఒక వేళ ఏదైనా సమాచారం ఉంటే మేమే అధికారికంగా చెబుతామని అన్నారు.