దర్శక-నిర్మాతలు పురాణాలపై సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ను రాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ పాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’ను రూపొందిస్తున్నారు. అందులో సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ వార్త చిత్రసీమలో హాట్టాపిక్గా మారింది. అది అందరిలోనే తీవ్ర అసక్తిని రేపుతోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్న ముగ్గురు నటులు మహేశ్బాబు, దీపిక పదుకొణె, హృతిక్రోషన్.. ఒకే తెరపై కనిపించనున్నారట.
ఓ ప్రముఖ నిర్మాత రూ.300కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆ సినిమాలో మహేశ్ను రాముడిగా.. సీతగా దీపిక.. రావణుడిగా హృతిక్రోషన్ను చూపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటులతో పాటు దక్షిణాదిన స్టార్డమ్ ఉన్న హీరో అయితే.. సినిమాకు కలిసొస్తుందని భావించి రాముడి పాత్రలో నటించేందుకు మహేశ్ను సదరు నిర్మాత సంప్రదించారట. పైగా రాముడిగా మహేశ్ అచ్చుగుద్దినట్లు నప్పుతారని వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ ప్రతిపాదనపై మహేశ్ స్పందన ఏంటనేది ఇంకా తెలియలేదు. ఇకవేళ ఈ సినిమాకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. బాలీవుడ్లో మహేశ్కు ఇదే తొలి సినిమా కానుంది. మరోవైపు.. మహేశ్ను రాముడిగా చూపిస్తే మాత్రం అభిమానులు కొత్తరకం అనుభూతి ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే మరి.!
ప్రస్తుతం మహేశ్బాబు ‘సర్కారువారి పాట’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. పరుశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ సరసన కీర్తి సురేశ్ సందడి చేయనుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా.. దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్స్టార్ మహేశ్బాబు కాంబినేషన్లో రాబోతున్న చిత్రంపైనా టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.