ఇప్పటివరకు క్వీన్, ఝాన్సీ లక్ష్మిబాయి, పంగా వంటి చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ను చూశారు. తాజాగా తమిళనాడు అమ్మ జయలలిత పాత్రలోనూ కంగన మెరవబోతోంది. అయితే ఎప్పుడైనా కంగనను సిల్క్ స్మిత్ పాత్రలో ఊహించుకున్నారా..? ఒకప్పటి సినిమాల్లో వ్యాంప్ పాత్రలో అందాలను ఆరబోసి కుర్రాళ్లను కైపెక్కించిన సిల్క్ స్మిత పాత్రలో కంగనను ఊహించుకుంటే ఎలా ఉంటుంది. అయితే ఇదేమీ రాబోయే సినిమా గురించి కాదు. ముగిసిన సినిమా గురించి.
కంగన రనౌత్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది కంగన. మహారాష్ట్ర ప్రభుత్వంపై, బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రతిక్షణం ఘాటు కామెంట్స్తో రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడూ నటీనటులను కూడా తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా హీరోయిన్ విద్యాబాలన్ గురించి పాజిటివ్గా ఓ పోస్ట్ పెట్టింది.
డర్టీపిక్చర్ సినిమాలో విద్యాబాలన్ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసిందని చెప్పింది. ఆమె సిల్క్ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని ప్రశంసించింది. అంతేకాదు ఆ సినిమా పాత్ర ముందుగా తనకు వచ్చినా కథలో దమ్ము లేదనుకుని వదులుకున్నట్లు వెల్లడించింది. ఒకవేళ తాను చేసి ఉన్నా విద్య స్థాయిలో నటించి ఉండకపోవచ్చని చెప్పుకొచ్చింది. అందువల్ల ఆ సినిమా చేజార్చుకున్నందుకు తాను ఎన్నడూ బాధపడలేదని, ఎప్పటికీ బాధపడనని తెలిపింది.
కాగా.. డర్టీ పిక్చర్ డైరెక్టర్ మిలన్ లుత్రియా కంగనాతో అంతకుముందే ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా కాగానే వెంటనే కంగనాతో డర్టీపిక్చర్ ప్లాన్ చేశాడు. కానీ ఆ కథలో బలం లేదనుకున్న కంగన నో చెప్పేసింది. వెంటనే విద్యాబాలన్ ఎంట్రీ ఇచ్చింది. డర్టీపిక్చర్లో సిల్క్ స్మిత క్యారెక్టర్లో నటించింది, కాదు జీవించేసింది. ఈ క్యారెక్టర్కు గానూ విద్యాబాలన్కు నేషనల్ అవార్డు కూడా లభించింది.