కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఉదృతంగా ఉందనేది కూడా గుర్తు చేయనక్కర్లేదు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ కూడా కరోనాతోనే మరణించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి చాలా మంది హీరోలకు కరోనా వచ్చి పోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ను ఈ మహమ్మారి వెంటాడింది. ఈయనకు కూడా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేసాడు జూనియర్ ఎన్టీఆర్. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని చెప్పాడు. అయితే ఏం సమస్య లేదని.. అంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని చెప్పాడు. అభిమానులు ఇంత కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపాడు జూనియర్. ఫ్యాన్స్ అంతా ధైర్యంగా ఉండమని చెప్పాడు ఈయన. తాను తన కుటుంబం అంతా బాగున్నామని.. ఫ్యామిలీ అంతా ఐసోలేట్ అయిపోయామని తెలిపాడు. నిరంతరం వైద్యుల సంరక్షణలోనే ఉన్నామని.. కోవిడ్కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.
తన స్టాఫ్లో కొందరికి పాజిటివ్ రావడంతో ఐసోలేట్ అయిపోయాడు జూనియర్. ఇప్పుడు ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ట్రిపల్ ఆర్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ లైన్లో ఉన్నారు.