ఆసరా పథకం అనేది పెద్ద మోసమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ పథకం పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా పెడుతున్నారని విమర్శించారు. తొలి విడతలో 87 లక్షల మందికి ఆసరా అందించారని… ఇప్పుడు 78.76 లక్షల మహిళలకు తగ్గిపోయిందని… మిగిలిన ఎనిమిదిన్నర లక్షల మంది లబ్ధిదారులు ఏమయ్యారు ముఖ్యమంత్రి గారూ? అని ప్రశ్నించారు.
మొత్తం 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే… కేవలం 78 లక్షల మందికే ఆసరా పథకాన్ని అందిస్తారా? అని అడిగారు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పిన మీరు… ఇప్పుడు ఒక్క విడతను పది విడతలు చేశారని మండిపడ్డారు. సూట్ కేస్ కంపెనీల్లా సంక్షేమం లెక్కలు కూడా ఉంటున్నాయని… డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును స్వాహా చేయడం వారిని ఉద్ధరించడమా? అని ప్రశ్నించారు.