ఐపీఎల్ 2021కు (IPL 2021) పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా (Match Postponed) పడింది. కోల్కతా జట్టులోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గత నాలుగు రోజులుగా చేసిన టెస్టుల్లో మూడో రౌండ్లో కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయ్యారు. దీంతో ఫ్రాంచైజీ మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయింది. జట్టులోని కొంత మంది క్రికెటర్లు కూడా అనారోగ్యానికి గురి కావడంతో సోమవారం సాయంత్రం బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా వేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. జట్టులో ప్లేయర్లు కోవిడ్ పాజిటివ్ తేలడంతో కోల్కతా జట్టు బెంగళూరుతో మ్యాచ్ ఆడేందుకు సుముఖంగా లేరని.. ఇతర జట్ల ఆరోగ్యాలు కూడా ముఖ్యమేనని ఐపీఎల్ తెలిపింది. కేకేఆర్ ఫ్రాంచైజీ మొత్తాన్ని ఐసోలేషన్కు తరలించి నిరంతరం పర్యవేక్సిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. ఎవరైనా రాబోయే రోజుల్లో పాజిటివ్గా తేలుతారనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. ఐపీఎల్ అధికారులు, కేకేఆర్ యాజమాన్యం ఈ విషయంలో సమన్వయంతో ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
UPDATE: IPL reschedules today's #KKRvRCB match after two KKR players test positive. #VIVOIPL
Details – https://t.co/vwTHC8DkS7 pic.twitter.com/xzcD8aijQ0
— IndianPremierLeague (@IPL) May 3, 2021
ఐపీఎల్లో ప్రతీ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన బయోబబుల్ ఉంటుంది. ఒక బబుల్లో ఉన్న వ్యక్తులు మరో బబుల్లోకి వెళ్లే వీలుండదు. కేవలం ఆటగాళ్లు మాత్రమే మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో ఇతరులతో కలుస్తారు. వాళ్లు కూడా వేరే బబుల్కు చెందిన వ్యక్తులే. అనుక్షణం బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించకుండా బీసీసీఐ బబుల్కు నలుగురు చొప్పున సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించింది. అయినా సరే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఐపీఎల్లో ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవ్వాళ జరగాల్సింది 30వ మ్యాచ్. కరోనా దెబ్బ పడటంతో ఈ మ్యచ్ తిరిగి ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి. మరోవైపు కోల్కతా ఆడాల్సిన మిగతా మ్యాచ్ల సంగతి ఏంటో ఇంకా స్పష్టత లేదు. ఫ్రాంచైజీ మొత్తం ఐసోలేషన్లోకి వెళ్తే.. మిగిలిన మ్యాచ్లను ఎవరు ఆడతారా అర్దం కావడం లేదు.