దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. రత్నకుమార్ గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. అయితే చాలా రోజులుగా రత్నకుమార్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారిన పడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
ఘంటసాల కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రత్నకుమార్.. డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన తన వాయిస్ అందించి ఆకట్టుకున్నారు. ఎకధాటిగా ఎనిమిది గంటలపాటు డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. డబ్బింగ్తోపాటు.. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్తో పాటు 30కిపైగా సినిమాలకు మాటలు అందించారు.