ఇప్పుడు మన సౌత్ సినిమాలకే కాదు.. హీరోలకు కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే మొన్నటి వరకు నార్త్, సౌత్ అంటూ విడదీసిన సినిమాకు ఇప్పుడు దేశమంతా ఒకటే సినిమా అనే భావన వచ్చేసింది. దీంతో దక్షణాది సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో మన హీరోలు కూడా దేశమంతటి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొనే పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.
తమిళ హీరోల విషయానికి వస్తే రజని, కమల్ లాంటి సీనియర్ హీరోల తర్వాత సూర్య, విశాల్, ఆర్య, విక్రమ్ లాంటి హీరోలు కూడా మన తెలుగులో వారి రేంజికి తగ్గట్లు మార్కెట్ సొంతం చేసుకున్నారు. కానీ తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దళపతి మాత్రం తెలుగులో ఆ రేంజిలో మార్కెట్ చేసుకోలేకపోతున్నాడు. ఇందుకోసం స్ట్రైట్ తెలుగు సినిమా ఒకటి చేయాలని కూడా విజయ్ కొన్నాళ్లుగా ప్రయత్నించగా దానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ అదీ వీలు పడలేదు.
అయితే.. ఇప్పుడు విజయ్ తెలుగు సినిమాపై క్లారిటీ వచ్చింది. తాజాగా వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో విజయ్ హీరోగా చేయనున్న సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనుండగా పాన్ ఇండియా సినిమాగా ఇది చేయబోతున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా పాండమిక్ తర్వాత దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే 65వ సినిమా తర్వాత వంశీ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.